కాంగ్రెస్ 2019 లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలో సంస్ధాగత మార్పులకు శ్రీకారం చుట్టాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో ఉన్న పార్టీకి మళ్లీ జీవం పోయాలంటే పార్టీ ప్రక్షాళన చేయాలని అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నారు.
దీనిలో భాగంగానే రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా చేయాలని ఆమె నిర్ణయించినట్లు సమాచారం. పార్టీకి యువరక్తం ఎక్కించాలని రాహుల్ గాంధీ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన టీం ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పార్లమెంట్ లో పార్టీ నాయకురాలిగా మాత్రం సోనియా గాంధీ కొనసాగే అవకాశం ఉంది.
ఇక పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న సీనియర్లను రాజీనామా చేయాల్సిందిగా సోనియా గాంధీ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాహుల్ గాంధీ అధ్యక్షుడైతే పార్టీకి మరింత గడ్డు కాలం వస్తుందని కొందరు సీనియర్లు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కూడా సోనియా గాంధీయే నాయకత్వం వహించాలని వారు కోరుకుంటున్నారు.