సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా కార్మికులు మృతి
కోర్టుల తీర్పులు పట్టించుకోరు.. ఉన్నతాధికారుల నివేదికలు చెత్త డబ్బాలో పడేస్తారు. కార్మికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు ఉన్నా వాటిని పట్టించుకోకపోవడంతో కార్మికుల ప్రాణాల్లో గాల్లో కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏడు మంది కార్మికులు ఊపిరాడక మృతిచెందారు.చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని మొరం గ్రామంలో శ్రీవెంకటేశ్వర హెచరీస్ (వీహెచ్పీఎల్)లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి ఏడు మంది కార్మికులు వెళ్లారు. శుక్రవారం ఉదయం హేచరీస్ యాజమాన్యం ఆదేశాలతో వ్యర్థాలు తీయడానికి డ్రైనేజీలోకి దిగారు. అయితే వ్యర్థాలతో పాటు రసాయనాలు కూడా కలవడంతో కార్మికులకు ఊపిరాడలేదు.
ఈ క్రమంలో మొదట దిగిన నలుగురు కార్మికులు స్పృహ తప్పి అందులోనే ఉండిపోయారు. వాళ్లను పైకి లాగేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కార్మికులు కూడా అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు తెలుసుకొని మురుగు కాలువ పైకప్పును పగులగొట్టి కార్మికులను బయటకు తీశారు. వీరిని చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు మార్గమధ్యలోనే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో మొరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఎదుట గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
మృతిచెందిన వారు వీరే..: రెడ్డప్ప, రమేశ్, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకట్రాజులుగా గుర్తించారు.