వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్డును ఢి కొట్టడంతో కారులో మంటలు చెలరేగిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని ఐతేపల్లి వద్ద చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన పేరిపురం వాసులుగా పోలీసులు గుర్తించారు.
డ్రైవర్ నిద్ర మత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అతివేగంగా వెళ్లొద్దని ఎన్ని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ప్రయాణికులు పట్టించుకోకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇకనైనా ప్రయాణికులు లిమిటెట్ వేగంతో వెళ్లాలని సూచించారు.