ప్రపంచంలో ప్రతీ రోజు ఏదో ఒక చోట ఉగ్రదాడులు జరుగుతూనె ఉన్నాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, సిరియా లాంటి దేశాలతో పాటు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఓ చోట దాడులు జరుపుతూ కలకలం రేపుతోన్న ఉగ్రవాదులు తాజాగా ఈజిప్ట్లో రెచ్చిపోయారు.
సినాయ్ ప్రార్థనామందిరం వద్ద పెను బీభత్సం సృష్టించారు. ముందు మసీదులోపల బాంబుపేల్చి పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు అనంతరం బయటకు పారిపోతోన్న వారిపై కూడా దాడులకు తెగబడ్డారు. మసీదు వద్దకు నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు.. భయంతో బయటకు పరుగులు తీస్తోన్న ప్రజలపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 184 మంది మృతి చెందగా మరో 150 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈజిప్ట్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.