పోలవరం ప్రాజెక్టు అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది కేంద్రం. ప్రాజెక్టు అంచనాల పెంపుపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేసింది. పోలవరం ముంపు ప్రాంతాల్లో దశలవారీగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ప్రాజెక్టు అవసరమైన 1.66లక్షల ఎకరాల్లో 1.10లక్షల ఎకరాలు సేకరించామని తెలిపారు. కాగా, 98, 480 కుటుంబాలు ఈ ప్రాజెక్టుతో నిర్వాసితులు అవుతున్నారన్నారు. ఇప్పటి వరకు 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామన్నారు.
ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తేనే.. పెంచిన కొత్త అంచనాలను ఆమోదిస్తామని స్పష్టం చేసింది. 2010-11లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.16,101కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంచనాలను సవరించి రూ. 58,319 కోట్లు అవుతుందని తెలిపింది.
పెంపు అంనాలను సీడబ్ల్యూసీ పరిశీలిస్తోందని, పోలవరం సవరించిన అంచనాలపై కమిషన్ కొన్ని వివరణలు కోరిందని కేంద్రం తెలిపింది. భూసేకరణ, పునరావాసం, కుడి-ఎడమ కాలువల డిజైన్లు మార్పు, హెడ్ వర్క్స్ పరిమాణం పెంపు తదితర అంశాలపై వాటర్ కమిషన్ సమాచారాన్ని కోరిందని, ఈ అంశాలపై రాష్ట్రప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తే.. ఆ మేరకు సవరించిన అంచనాలకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం తెలుపుతుందని పేర్కొంది.