వైసీపీ చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం కడపలోని పెద్ద దర్గా, పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఇడుపుల పాయలోని తండ్రి సమాధికి నివాలులు అర్పించి నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.
అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కోటేశ్వరమ్మతో పాటు వేదపండితులు జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పొట్లూరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడలోని గేట్వే హోటల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో భేటీ అవుతారు. అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లి బయల్దేరి వెళతారు.