ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఆగష్టు 26న ఎన్నికలు నిర్వహించనుండగా.. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. సంఖ్యా పరంగా చూసుకుంటే ఆ మూడు ఎమ్మెల్సీలు కూడా వైసీపీకే దక్కనున్నాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన కరణం బలరామ కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీకి చెందిన ఆళ్ల శ్రీనివాస్ (నాని), కొలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందటంతో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. నామినేషన్లకు తుది గడువు దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు. అందరూ ఊహించినట్లుగానె ప్రస్తుతం జగన్ మంత్రి వర్గంలో కొనసాగుుతన్న మోపిదేవి వెంకట రమణ, హిందూపురం నియోజక వర్గంనుంచి బాలయ్య చేతిలో పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ ఇగ్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ ఖరారు చేశారు.
ఇక్బాల్ హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడారు. మైనార్టీ కోటాలో ఆయన పేరు ఖరారు చేశారు. ఆది నుంచి తనతోపాటే ఉండి, కేసుల్లో జైలుకు వెళ్లిన మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తూన్నారు. మరోవైపు, ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో జగన్ సంప్రదింపులు జరిపారు.
మూడో ఎమ్మెల్సీ స్థానాన్ని చిలకలూరి పేటకు చెందిన మర్రి రాజశేఖర్కు కేటాయిస్తారని భావించారు. బీసీ మహిళ అయిన విడదల రజినీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్.. ప్రత్తిపాటి పుల్లారావును ఓడిస్తే మర్రి రాజశేఖర్ను మంత్రి చేస్తానని మాటిచ్చారు. కాని ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు బదులు మరే పదవి ఏదైనా ఇస్తారో చూడాలి.