ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకీ బిగ్షాక్ తగిలిందనే చెప్పాలి. ఆ పార్టీకి ప్రజాకర్శన నేతగా రేవంత్రెడ్డి అన్న సంగతి తెలసిందే. అయితే రేవంత్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో తెలంగాణా రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. అయన అరెస్ట్ తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఐటీ, ఈడీ అధికారులు రైడ్ చేసే సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. పనిమనుషులను బయటకు పంపించి సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్లోని రేవంత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు రేవంత్కు ఫోన్ చేసి హైదరాబాద్ రావాలని కోరినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఆయన కోస్గి నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
హైదరాబాద్ బయలు దేరే ముందు రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ, కేడీలు కలిసి నన్ను మళ్లీ జైలుకు పంపేందుకు సిద్ధమయ్యారు. అంతా బాగుంటే మళ్లీ వస్తా.. లేకుంటే జైలు నుంచే నామినేషన్ వేస్తా.. ఆ తర్వాత అంతా మీరే చూసుకోవాలి, నన్ను గెలిపించాలి’ అని రేవంత్ అన్నారు.
రేవంత్ తన నివాసానికి చేరుకోగానే ఐటీ, ఈడీ అధికారులు ఆయణ్ని సుదీర్ఘంగా విచారిస్తారని తెలుస్తోంది. అనంతరం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఆయణ్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అధికారులు అరెస్టు వారెంట్లతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోస్గి ప్రచారంలో మాట్లాడిన మాటలే తనకు చివరి ప్రసంగం కావొచ్చు అన్నారు. ఈ వ్యాఖ్యలు గమనిస్తే రేవంత్ కూడా అరెస్టు తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా ఓటుకు నోటు కేసులో ఉన్న సెబాస్టియన్ ఇంట్లో కూడా దాడులు జరగడం ఇందుకు మరింత ఊతమిస్తోంది. అయితే.. రేవంత్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తారా, లేదా ఓటుకు నోటు కేసులో అరెస్టు చేస్తారా అనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేం. ఓటుకు నోటు కేసులో గనక అరెస్టు జరిగితే.. కాంగ్రెస్ నాయకులే కాకుండా, టీడీపీ నేతలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా కలవరం తప్పదు