దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అత్యధికంగా ఎంపీ సీట్లు సాధిస్తుందని ఇప్పటికే అనేక సర్వేలు స్పష్టం చేశాయి. వైసీపీ 25 సీట్లకు గాను 23 సీట్లు సాధిస్తుందని …. అధికార టీడీపీకి కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని లేటెస్ట్ సర్వే సంస్థ టైమ్స్ నౌ – వీఎంఆర్ అంచనా వేసింది. సర్వేలు అటుంచితే ఇక పార్టీ తరుపున ఎంపీ అభ్యర్తుల వేటలో పడ్డారు జగన్. చంద్రబాబు కూడా అభ్యర్తులను ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు.
తాజాగా అనంతపురం జిల్లాలో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్తుల పేర్లను జగన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో రెండు ఎంపీసీట్లను కోల్పోయింది. అనంతపురం ఎంపీ సీటును తక్కువ మెజారిటీతో, హిందూపురం ఎంసీ సీటును మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. ఈ సారి అలాంటి ఘటన రిపీట్ కాకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 25 కు 25 ఎంపీసీట్లు గెలిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. టీడీపీనీ ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్తులను రంగంలోకి దింపుతున్నారు.
ప్రజాసంకల్ప యాత్రలో జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లను బీసీలకు కేటాయిస్తామని ప్రకటించారు. ఆ రెండు పార్లమెంట్ నియోజక వర్గాలకు బీసీ అభ్యర్తులే ఖరారయ్యారు. హిందూపురం ఎంపీ టికెట్ గోరంట్ల మాధవ్ కు దాదాపు ఖరారు అయినట్లేనని పార్టీ వర్గాల నుంచి సమాచారం. మాధవ్ తన సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీలో చేరారో తెలిసిన అందరికి తెలిసిందే. కురుబ సామాజికవర్గానికి చెందిన ఈయనకు హిందూపురం ఎంపీ టికెట్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.
అనంతపురం ఇన్ చార్జిగా కొన్నాళ్లుగా ఉంటూ వస్తున్న బోయ సామాజికవర్గం నేత పీడీ రంగయ్యకు ఆ టికెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఇలా రెండు ఎంపీ సీట్లనూ బీసీలకు జగన్ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనంతపురం టీడీపీ ఎంపీగా జేసీదివాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. ఆస్థానం నుంచి ఆయన కొడుకు జేసీ పవన్ రెడ్డి పోటీ చేస్తారనే వార్తలు వనిపిస్తున్నాయి. జగన్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.