భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ గత కొంత కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించి ఇటీవల తమిళనాడు లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే పోటీలో నిలిచిన ఏ ఒక్కరూ గెలువలేదు సరికదా కమల్ హాసన్ సైతం ఓడిపోయారు. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయారు.
ఇక ఎన్నికల తర్వాత కమల్ హాసన్ ఆయన స్థాపించిన పార్టీపై విమర్శలు మొదలు పెట్టారు. పలువురు కీలక నేతలు రాజీనామా చేసి వెళ్తున్నారు. తాజాగా పార్టీని వీడుతూ ఆరోపణలు చేస్తున్న వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ తేల్చి చెప్పారు.
ఒకసారి పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఎవరున్నా, లేకపోయినా తను ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. అయితే పార్టీని వీడే నేతలు కమల్ పై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కమల్ ట్విట్టర్ వేధికగా సమాధానం ఇచ్చారు. పార్టీని వీడి వెళ్లే వారు చేసే ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు.