తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగులు రచ్చ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై సిఎం కేసిఆర్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరి బీజేపీ పై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తోందని, ప్రభుత్వాలను కూల్చి దొడ్డి దారిలో అధికారం చేజిక్కించుకొనేందుకు ప్రయత్నించడం ఏంటని ప్రశ్నించారు ? ఎమ్మెల్యేలను కొంటె ఎన్నికలెందుకు ? ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం అంటూ బీజేపీ అధిష్టానంపై కేసిఆర్ మండి పడ్డారు. అంతే కాకుండా ఫామ్ హస్ జరిగిన పరిణామాలకు సంబంధించి పలు వీడియో క్లిప్స్ ను కూడా విడుదల చేశారు.
అయితే కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై, వీడియో క్లిప్స్ పై బీజేపీ అధిస్థానం సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కేసిఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టకపోతే అది పార్టీకి తీరని నష్టం చేసే అవకాశం ఉందని భావించిన కమలనాథులు.. కేసిఆర్ వ్యాఖ్యలపై గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్నికూల్చే౦త బలహీనంగా టిఆర్ఎస్ ఉందా అంటూ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసిఆర్ చూపించిన వీడియోలో ఆయన ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఎక్కడ లేదని, ఇదంతా కేసిఆర్ చేస్తున్న డ్రామా అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా కేసిఆర్ వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించారు.
ఫామ్ హౌస్ స్క్రిప్ అంతా కేసిఆర్ డైరెక్షన్ లో తయారైందని, ఆ ఎపిసోడ్ అంతా పెద్ద డ్రామా అంటూ బండి సంజయ్ కొట్టిపారేశారు. కేసిఆర్ చూపించిన వీడియోలో ఏమి లేదని.. ఫస్ట్ షో, సెకండ్ షో కాదు.. కామిడీ షో అయిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. డిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ను దృష్టి మళ్లించేందుకే కేసిఆర్ ఇదంతా చేస్తున్నాడని, బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కేసిఆర్ మరియు బిజెపి నేతల మద్య నెలకొన్న ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మరి ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో బీజేపీ అక్రమంగా అధికారం చేపడుతోందన్న విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వచ్చే ఎన్నికల్లో బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.