నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీకి గుడ్ బై కొట్టి ఇంకా 24 గంటలు గడవక ముందే బాబుకు మరో బిగ్ షాక్ తగలబోతోంది. విదేశీ టూర్లో హాయిగా విహరిస్తుంటే ఇక్కడ మాత్రం టీడీపీనేతలు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఈసారి మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తెదేపాకి భారీ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ముల్లును ముల్లుతోనె తీయాలనె సామెత లాగా బాబు వెన్నుపోటు రాజకీయాలను గంటా కూడా అదే వెన్నుపోటు పొడవనున్నారు.
మాజీ మంత్రి ప్రస్తుత విశాఖ ఉత్తర శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు, మరో 15 మంది ఎమ్మెల్యేలతో కలసి టీడీపీకి వీడ్కోలు చెప్పనున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం వీరంతా కొలంబోలో ఉన్నట్లు సమాచారం. వారంతా కొలంబో నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకోనున్నట్టు తెలిసింది. అయితే, ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది సస్పెన్స్గా మారింది.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఏప్రిల్ 11 న జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ నుంచి కేవలం 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గెలిచారు. అయితే, ఆ 23మందిలో ఇప్పుడు గంటాతో కలిసి 16మంది ఒకవేళ జంప్ అయితే, ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి.
ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ కమలం కండువాలు కప్పుకొన్నారు. చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చేసరికి టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారంటూ ఎన్నికలకు ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే గంటా పార్టీ మారడంలేదని లోకేష్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత నుంచి గంటా శ్రీనివాసరావు మౌనంగానే ఉన్నారు. పెద్దగా ఎక్కడా వార్తల్లో కనిపించలేదు. వెన్నుపోటు రాజకీయాలకు పేటెంట్ అయిన బాబుకే వెన్నుపోటు రాజకీయం రుచిచూపిస్తున్నారు.