తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ముమ్మర ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలలో బిఆర్ఎస్ ను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు కూడా బిఆర్ఎస్ కు గట్టిగానే మద్దతు పలుకుతున్నాయి. దాంతో బిఆర్ఎస్ ను రెట్టించిన జోష్ తో దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు కేసిఆర్. ఇక తాజాగా మహారాష్ట్ర లోని నాదెండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో పలువురి నేతలకు బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసిఆర్.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దేశాన్ని అధివృద్ది పథంలో నడిపిస్తామని, ప్రస్తుతం తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు, దళిత బంధు, ఉచిత విధ్యుత్, ఇంటింటికి నల్లా వంటి పథకాలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అయితే మిగిలిన పథకాల విషయం అటుంచితే ఉచిత విధ్యుత్ అమలు దేశ వ్యాప్తంగా ఇవ్వడం అనేది కత్తి మీద సామే అని చెప్పుకోవాలి. అలాంటి హామీ కేసిఆర్ ఇవ్వడంతో బిఆర్ఎస్ పై దేశ ప్రజల చూపు పడే అవకాశం ఉందనేది కొందరి వాదన.
అయితే అయితే ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు జాతీయ స్థాయిలో బలమైన పార్టీలుగా వెలుగొందుతున్నాయి. మరోవైపు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జాతీయ పార్టీ హోదాలో ఎన్నికల బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో కేసిఆర్ ప్రభావం దేశంలో ఏ స్థాయిలో ఉండబోతుందనేది ఆసక్తికరం. అయితే తెలంగాణలో కేసిఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత కరెంట్, రైతు బంధు వంటి పథకాలకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దాంతో తెలంగాణ మోడల్ అంటూ నేషనల్ మీడియా కూడా ఎన్నో కథనాలు చాలా సందర్భాల్లో ప్రచురిస్తూనే వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మోడల్ అనేది దేశంలో సాధ్యమౌతుందా.. ప్రాంతీయ పార్టీగా పేరున్న బిఆర్ఎస్ ను దేశ ప్రజలు ఎంతమేర అదరిస్తారు ?.. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వంటి నాయకులకు ధీటుగా కేసిఆర్ ను ప్రజలు నమ్ముతారా ? అనే ప్రశ్నలు సగటు సామాన్యుడికి ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఎన్నికల వచ్చే వరకు ఎదురు చూడకతప్పదు.
ఇవి కూడా చదవండి