తల్లికోసం ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడిన యువతి ఇప్పుడు అందరితో ప్రశంసలు అందుకుంటోంది. మహారాష్ట్రలోని ఉస్గాన్ ప్రాంతంలో 12 రోజుల క్రితం ఈ ఘటన జరగగా.ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెల్తే….
మహారాష్ట్రలోని సాకోలీ తాలుకా పరిధిలోని ఉస్ గావ్ లో మేకలు పెంచుకుని జీవనం సాగిస్తున్న జీజాబాయి, కుమార్తె రూపాలీ (21)తో కలిసి ఉంటోంది. మార్చి 24వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మేకలను కట్టేసిన ప్రాంగణం నుంచి అలజడి శబ్దం రావడంతో నిద్రలేచిన జీజాబాయి, కుమార్తెతో కలిసి బయటకు వచ్చింది. రక్తపుమడుగులో మేక పిల్లలు పడి ఉండగా, చిరుతపులి వాటిని తింటూ కంటబడింది.
తలుపు తెరిచిన చప్పుడుకు వారిని చూసిన చిరుత వారిపై దాడికి దిగింది. తల్లిపై చిరుత దాడికి దిగడంతో.. అప్పటికే గాయపడిన రూపాలి శక్తినంత కూడదీసుకుని.. 15 నిమిషాలు చిరుతతో పోరాడింది. కర్రతో చిరుతని గట్టిగా కొడుతూనే.. అరుస్తూ తల్లిని ఇంటి లోపలికి తీసుకెళ్లింది. అప్పటికే స్థానికులు కూడా అక్కడికి రావడంతో.. చిరుత పారిపోయింది. తీవ్రంగా గాయపడిన రూపాలితో పాటు స్వల్పంగా గాయపడిన ఆమె తల్లినీ ప్రాథమిక చికిత్స కోసం స్థానికులు సకోలి ఆసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నాగ్పూర్లోని ఆసుపత్రికి రూపాలిని తరలించారు. తాజాగా ఆసుపత్రి నుంచి రూపాలి డిశ్చార్జ్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.