ఇటివలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ వేడుక ఘనంగా.. ఆసక్తికరంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి ప్రసంగం ఫ్యాన్స్ని ఉర్రూతలూగించింది. అయితే ఈ వేడుక అయ్యాక చిరు ప్రసంగం కంటే నాగబాబు ప్రసంగమే చర్చనీయాంశంగా మారింది. రామ్ గోపాల్ వర్మ.. యండమూరి వీరేంద్రనాథ్ లపై విమర్శలు చేయడం.. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ అటాక్ చేయడం మీదే అందరి దృష్టీ నిలిచింది.
ఈ గొడవకు సంబంధించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే చర్చలతో రెండు రోజులు గడిచాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరు ఈ గొడవలపై మాట్లాడేందుకు ముందుకు వచ్చారు. ఎప్పట్లాగే ఆయన వివాదాలకు తావులేకుండా డిప్లమాటిగ్గా మాట్లాడేసి వివాదాన్ని ముగించే ప్రయత్నం చేశారు. వర్మ తన గురించి.. తన చిత్రాల గురించి చేసే వ్యాఖ్యల గురించి పట్టించుకోనని అన్నారు చిరు. నాగబాబు మాత్రం ఆ వ్యాఖ్యలపై హర్టయి స్పందించి ఉండొచ్చన్నాడు.
ఐతే తాను నాగబాబు వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడనని చిరు స్పష్టం చేశాడు. అలాగే రామ్ గోపాల్ వర్మతో తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని.. అతడితో తనకు మంచి స్నేహం ఉందని చిరంజీవి తెలిపాడు. అలాగే.. పవన్ ‘ఖైదీ నెంబర్ 150’ వేడుకకు ఎందుకు రాలేదో కూడా చెప్పారు. రామ్ చరణ్ వ్యక్తిగతంగా పవన్ ను ఆహ్వానించాడని.. ఐతే తనకు పని ఉండటం వల్ల రాలేకపోతున్నానని పవన్ చెప్పాడని చిరు వెల్లడించాడు. ఐతే పవన్ తమ సినిమాకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన విషయాన్ని చిరు గుర్తు చేశాడు. అందరూ ప్రతి వేడుకకూ రావాలనేమీ లేదని చిరు ఈ వివాదానికి కూడా ముగింపు పలికే ప్రయత్నం చేశాడు.
Related