రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేసిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాల షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలుపెట్టారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్ ఆగిపోయింది.
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కాస్త తగ్గడంతో వరుసగా సినిమాల షూటింగ్ మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ కూడా తిరిగి ప్రారంభమైంది. ఈ షూట్ లో పవన్ కళ్యాణ్, రానా కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. హరిహర వీరమల్లు సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టిన పవన్ మలయాళ సినిమా రీమేక్ ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, రానా కు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.
మలయాళంలో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథను తెలుగులో మార్పులు చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కొద్దిపాటి మార్పులు చేశారు. అయితే కథలో పవన్ కళ్యాణ్ కోసం కథ మార్చినా రానా పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నప్పటికీ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read
రాజమౌళి – మహేష్ బాబు సినిమా కథ ఇదేనా..!