తమిళనాడులో రోడ్డుపై కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా పడేయడంతో వాటిని ఏరలేక పోలీసులు నానాతంటాలూ పడాల్సి వచ్చింది. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు దుండగులు నోట్ల కట్టలను రోడ్డుపై విసిరేసిన అనూహ్య ఘటన తమిళనాడులో జరిగింది.
వివరాల్లోకి వెల్తే…కోట్టూరుపురం సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, అటుగా వచ్చిన ఓ వాహనంలోని వారు రూ. 2000, రూ. 500, రూ. 200 నోట్ల కట్టలను రోడ్డుపై విసిరివేస్తూ వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమైన పోలీసులు, డబ్బుల కట్టలను ఏరే పనిలో పడ్డారు. మొత్తం రూ. 1.56 కోట్లను వారు విసిరివేసి వెళ్లారని, దాదాపు అర కిలోమీటర్ పరిధిలో ఈ డబ్బు పడిందని అధికారులు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకున్నామని, సదరు వాహనాన్ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బు ఎవరిది, ఎందుకోసం తీసుకెళుతున్నారనే దానిపై విచారణ చేపట్టారు.