రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు చేశారు.
సభా సంప్రదాయాలు, నిబంధనలపై పుస్తకాలను ప్రతీ సభ్యుడు క్షుణ్ణంగా చదవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. సభలో ప్రతిపక్షం కచ్చితంగా ఉండాలని… వారికి కచ్చితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తామని మరోసారి ఆయన స్పష్టం చేశారు. సభలో చర్చకు సంబంధించి సభ్యులందరూ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలన్న సీఎం జగన్… మాట్లాడబోయే అంశం, సభలో చర్చకు వచ్చే అంశం గురించి అందరికీ ఒక అవగాహన ఉండాలని అన్నారు. సబ్జెక్టుపై పూర్తిగా ప్రిపేర్ అయి అసెంబ్లీకి రావాలని లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు.
సభలో మన సంఖ్య ఎక్కువ కదా. మనం చేయి ఎత్తితే స్పీకర్ గారు అవకాశం ఇస్తారని చాలామంది భావిస్తారు. కానీ అలా జరగకపోవచ్చు. ఎందుకంటే ఫలానా అంశంపై వీరు-వీరు మాట్లాడుతారని స్పీకర్ గారికి లిస్ట్ ఇచ్చి ఉంటాం. ఆ లిస్ట్ ప్రకారమే స్పీకర్ గారు అందరికీ అవకాశం ఇస్తారు. ఆ జాబితాలో మన పేరు లేకపోతే మనకు అవకాశం రాకపోవచ్చు. దీనికి మరోలా అనుకోవాల్సిన పనిలేదు’ అని తెలిపారు.