ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్ షురూ చేస్తున్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కున్న టీడీపీకీ ఇప్పుడు వైసీపీ చుక్కలు చూపిస్తోంది. దీంతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలోకి వలసలు ఊపందుకోవడంతో ..పార్టీని ఎవరు వీడినా నష్టంలేదని పైకి గంభీరంగా చెబుతన్నా లోపల మాత్రం మదనపడుతున్నట్లు సమాచారం.
మంత్రిపదవులుకోసం ఆశపడి వైసీపీతరుపున గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయిస్తే…టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ భవిష్యత్తు కోసం వైసీపీలోకి వస్తున్నారు. టీడీపీనుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు ప్యాన్గూటికి చేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చీరాల ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. ఇక తాజాగా అనకాపల్లి ఎంపీ అవంత శ్రీనివాస్ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. గురువారం సాయంత్రం అవంతి.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలవనున్నారు. అవంతి కోరినట్లు భీమిలి సీటును ఇచ్చేందుకు జగన్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం అవంతి హైదరాబాద్లోనే ఉన్నారు. అవంతితోపాటూ… మరో సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటూ… అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవంతి శ్రీనివాస్ గురువారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీలో చేరడంపై వస్తున్న వార్తలు కరెక్టేనని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
సాయంత్రం జగన్ సమక్షంలో అవంతి వైసీపీ కండువా కప్పుకోనున్నారు.అవంతి శ్రీనివాస్ తోపాటు మరో ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ టీడీపీలో బాంబుపేల్చారు వైవి సుబ్బారెడ్డి. ఆయన ఎవరో కూడా బాబుకు తెలుసునని స్పష్టం చేశారు.
వలసలపై సీఎం చంద్రబాబు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు పార్టీని ఎందుకు వీడుతున్నారో అర్థం కావడంలేదని వాపోయినట్లు తెలుస్తోంది. ఎవరు వెళ్లినా పార్టీకి నష్టంలేదని …ఆమంచితో పాటు మరో ఇరువురు వెళ్తారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. వలసతో వైసీపీ కళకళలాడుతుంటే…టీడీపీ సిబిరం వెళవెళ బోతోంది.