ఈ మధ్యన ప్రముఖ రాజకీయ నాయులు కనిపించడంలేదంటూ ఎక్కువగా పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి.గతంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకనిపించడంలేదంటు దున్నపోతుమీద ఆయన బొమ్మగీసి ప్రచారం చేశారు. వారంరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనిపించడంలేదంటూ అమేఠీలో గోడ పత్రికలు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాయ్బరేలీలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కనిపించడం లేదంటూ వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి
సొంత నియోజకవర్గాల్లో అటు రాహుల్.. ఇటు సోనియా గాంధీ కనిపించడంలేదంటూ పోస్టర్లు లభ్యం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాయ్బరేలీ నియోజకవర్గంలోని గోరాబజార్, మహానందపూర్, ప్రభుత్వ కాలనీలో ‘లోక్సభ ఎంపీ సోనియా గాంధీ కనిపించడంలేదు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి తగిన రివార్డును అందజేస్తాం’ అని పేర్కొంటూ ముద్రించిన పోస్టర్లు డజన్ల కొద్దీ కనిపించాయి.
అయితే ఈ పోస్టర్లు రాయ్బరేలీ పీపుల్ పేరిట ప్రత్యక్షమయ్యాయి. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సోనియా గాంధీ ఆమె నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి చర్చించలేదనే ఆగ్రహంతో ప్రజలు ఇలా చేశారని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సోనియా గాంధీ ఒక్కసారి కూడా రాయ్బరేలీకి వెళ్లలేదట. ఆర్ఎస్ఎస్, భాజపాకు చెందిన నేతలే ఈ చర్యలకు పాల్పడి ఉంటారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.