తెలంగాణాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో దూసుకు పోతున్నారు. కేసీఆర్ను ఫామౌస్కే పరిమితం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు మహాకూటమి ఏర్పడి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కేసీఆర్ అలాగే ముందుకెళుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. మోదీని చూస్తే కేసీఆర్ లాగు తడుస్తోందని ఎద్దేవ చేశారు. సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆరే ఒప్పుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాన్యులు బతకలేరని అన్నారు. ప్రాజెక్టులలో తీసుకున్న కమిషన్ ను… ఇప్పుడు కేసీఆర్ పంచుతున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీ వద్దనుకుని ఉంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎం నేడు టీఆర్ఎస్కు మిత్రపక్షమని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు.
సీఎం చంద్రబాబు తెలంగాణా అభివృద్ధిని ఎలా అడ్డుకుంటున్నారో కేసీఆర్ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని ఉత్తమ్ తెలిపారు. దాచుకున్న సొమ్ము ఎత్తుకుపోతారని నరేంద్రమోడీ అంటే కేసీఆర్కు భయమన్నారు. చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఖాజీపేట డివిజన్ గురించి కేసీఆర్ ప్రధానిని ఎందుకు అడగలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్ లా బ్రోకర్ బతుకు బతికి తాము రాజకీయాల్లోకి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.