తెలంగాణా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సుడిగాలి పర్యటన చేస్తూ బహిరంగ సభలలో మహాకూటమిపై తన పదునైన మాటలతో విమర్శలు చేస్తున్నారు. జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ….రేపు జరిగే ఎన్నికల్లో అధికారం టీఆర్ ఎస్ దేనని మరో సారి స్పష్టం చేశారు.
15ఏళ్లపాటు ఉద్యమం చేసి నాలుగేళ్లు అద్భుత పాలన అందించిన టీఆర్ఎస్ పార్టీ మరోవైపు ఉందని అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కోరారు. తాను పర్యటిస్తున్న అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు 70వేల నుంచి 80 వేల మంది ప్రజలు హాజరవుతున్న విధానం చూస్తుంటే టీఆర్ఎస్ దే గెలుపు అని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
పోటీ కేవలం టీడీపీ – కాంగ్రెస్ కూటమి, టీఆర్ఎస్కు మాత్రమే. మిగతా వాళ్ల గురించి మనకు అనవసరం. అభివృద్ధి, సంక్షేమం ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దు. రెండు పార్టీలు కలిపి 58 ఏండ్లు పాలించాయి. వారి పరిపాలనలో కరెంట్ ఎట్ల ఉంది. ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించాలి. మేధావులమని మాట్లాడుతారు. మరి మేధావులు అయితే 24 గంటల కరెంట్ ఎందుకివ్వలేదని బాబును ప్రశ్నించారు.
ఇకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పీడ మళ్లీ తెలంగాణకు అవసరమా అంటూ నిలదీశారు. చావునోట్లో పెట్టి సాధించిన తెలంగాణలో తెలంగాణ పెత్తనాన్ని ఎందుకున్నారు. రాష్ట్రంలో కడుతున్న పలు ప్రాజెక్టులను బాబు అడ్డుపడుతున్నారని ఆరోపనలు చేశారు. కాంగ్రెస్ పార్టీకీ సిగ్గు, శరం ఉంటే ఒంటరిగా పోరాడాలని అలాకాకుండా బాబును అద్దెకు తెచ్చుకుంటున్నారని ఎద్దేవ చేశారు.
గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్లను ఫెడరల్ ఫ్రంట్ ద్వారా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆమోదించడం లేదన్నారు. రాబోయే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వంలో గిరిజన, ముస్లిం రిజర్వేషన్లను ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.