ఎన్నికల ఫలితాలు తర్వరలో వెలువడనున్న నేపధ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయం వేడెక్కింది. వైసీపీ, టీడీపీకీ చెందిన పందెం కోళ్లు ఢీ అంటె ఢీ అనే మాటల యుద్ధానికి దిగారు.దీంతో ఎప్పుడు ఏంజరగుతుందోననె ఆందోళన నెలకొంది. టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ.. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు చేసిన ఫోన్కాల్తో నియోజకవర్గంలో వేడి రాజుకుంది.
వల్లభనేని వంశీ తమను బెదిరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశాయడంతో రాజకీయం మరింత వేడెక్కింది.వంశీ తమ ఇంటికొచ్చి సన్మానం చేస్తానంటూ ఫోన్ చేస్తున్నారని సీపీకి చెప్పారు. సీన్ కట్ చేస్తే వెంకట్రావు ఫిర్యాదుపై వంశీ లేఖ రాస్తూ మళ్లీ హీట్ పెంచారు.
వంశీ రాసిన లేఖపై యార్లగడ్డ వెంకట్రావుకు తీవ్రంగా స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరంటూ కౌంటరిచ్చారు. వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిస్కరించేందుకు రాజకీయాల్లోకి రావాలి. ప్రజలకు సమస్యలు సృష్టించేందుకు రాజకీయాల్లోకి రాకూడదన్నారు.
ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేయడం వంశీకి అలవాటన్నారు వెంకట్రావు. వంశీ అరాచకాలు టీడీపీ నేతలే భరించలేక పోతున్నారని.. గుడిని, గుడిలో లింగాన్ని మింగిన చరిత్ర వంశీదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తె తన అక్రమాలపై ఎక్కడ విచారణ జరుగుతుందోనని వంశీ భయపడుతున్నారన్నారు.వైసీపీ అధికారంలోకి రాగానే వంశీ చేసిన దోపిడీనీ బట్టబయలు చేస్తామన్నారు. ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.