సాధారణ టికెట్ తో ఒకే గమ్యానికి వెళ్లే ఏ రైలులోనైనా ప్రయాణించొచ్చని భారతీయ రైల్వే తెలిపింది. వికల్ప్ పథకం ద్వారా పాసింజర్ లేదా ఎక్స్ ప్రెస్ టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులు రైలు మిస్ అయితే తర్వాత అదే మార్గంలో అందుబాటులో ఉన్న ఏ రైలులోనైనా ప్రయాణించొచ్చని తెలిపింది. ఈ విషయం పై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ ,స్పెషల్ రైళ్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఇలా సూపర్ ఫాస్ట్ రైళ్లను వినియోగించుకున్నందుకు పాసింజర్ల నుంచి ఎలాంటి ఎక్స్ ట్రా చార్జీలు వసూలు చేయబోమని చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రయాణీకులు ఆయా రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తులను వినియోగించుకోవచ్చని తెలిపింది. రిజర్వేషన్ వెయిటింగ్ లిస్టులో ఉన్న పాసింజర్లు కూడా ఆ టికెట్లతో ఖాళీగా ఉన్న రైళ్లలో ప్రయాణించొచ్చని వివరించింది.
ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ‘వికల్ప్’ స్కీంను ఎంచుకోవాలని తెలిపింది. దీంతో టికెట్లు వెయిటింగ్ లిస్టులో ఉంటే అదే టైం కి ఖాళీగా ఉండే రైలు వివరాలు సదరు వ్యక్తి మొబైల్ కు ముందుగానే వస్తాయని తెలిపింది. కాగా, ఫ్లెక్సీ ఫేర్ సిస్టంను ప్రారంభించిన తర్వాత ప్రీమియర్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. రైల్వే తాజా నిర్ణయంతో లక్షలాది ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది.
Related