ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో బర్మింగ్హామ్ వేదికగా మంగళవారం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే ఏడు మ్యాచ్లాడిన భారత్ జట్టు ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ రోజు మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. మరోవైపు ఏడు మ్యాచ్లాడిన బంగ్లాదేశ్ జట్టు మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. కేదార్ జాదవ్, కుల్దీప్ స్థానంలో దినేశ్ కార్తిక్, భువనేశ్వర్ జట్టుతో చేరారు. ఇదిలా ఉండగా, 2007 వరల్డ్ కప్లో ఊహించని విధంగా ఆ టీం భారత్ను ఓడించింది. భారత వరల్డ్ కప్ చరిత్రలో అది మరచిపోలేని దుర్దినం. అయితే, ఆ తర్వాత జరిగిన 2011, 2015 వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్దే పైచేయి అయ్యింది.
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, యుజువేంద్ర చాహల్, బుమ్రా
బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్పీకర్ రహీమ్, లిటన్ దాస్, మొసద్దీక్ హుస్సేన్, షబ్బీర్ రహీమ్, మహ్మద్ సైఫుద్దీన్, మష్రాఫీ మొర్తజా, రుబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహమాన్