మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసి, తొలి మ్యాచ్ లోనే ఓపెనర్ గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ 76 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. గత రెండు టెస్టుల్లో పరుగులు సాధించడానికి మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇబ్బంది పడగా.. మయాంక్ మాత్రం చాలా సులువుగా రన్స్ చేశాడు. ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్మన్లాగా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్ర టెస్ట్లోనే అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్మన్గా మయాంక్ నిలిచాడు.
మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో విఫలమైన రాహుల్, మురళీ విజయ్ ల స్థానంలో హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లను పంపారు. పెర్త్ టెస్ట్ పరాజయంతో జట్టులో సమూల మార్పులు చేసిన టీమ్ మేనేజ్మెంట్.. ఉన్నపళంగా ఈ కర్ణాటక బ్యాట్స్మన్ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
వచ్చిన అవకాశాన్ని మయాంక్ చక్కగా సద్వినియోగం చేసుకుని తనపై టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 27 ఏళ్ల మయాంక్.. క్రీజులో ఎంతో కాన్ఫిడెంట్గా కనిపించాడు. ముఖ్యంగా తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టిన స్పిన్నర్ నాథన్ లయన్పై అతడు ఎదురు దాడికి దిగాడు. అతని బౌలింగ్లోనే ఓ సిక్స్ కూడా బాదాడు.