ఐపీఎలస్ 2018 సీజన్లో హైదరాబాద్ జట్టు ఆటగాడు రషీద్ఖాన్ తన ఆల్రౌండర్ ప్రతిభను ప్రధర్శించాడు. కోల్కతాతో జరిగిన కీలకమైన మ్యాచ్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్తో హైదరాబాద్కు ఒంటిచేత్తో ఘనవిజయం సాధించిపెట్టారు. అంతా తానై జట్టును ముందుకు నడిపించాడు రషీద్ ఖాన్.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో శుక్రవారం రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో అలవోక విజయం సాధించి పైనల్పోరుకు సిద్ధమయ్యింది. తొలుత రషీద్ ఖాన్ (34 నాటౌట్: 10 బంతుల్లో 2×4, 4×6), ఓపెనర్లు సాహా (35: 27 బంతుల్లో 5×4), శిఖర్ ధావన్ (34: 24 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడటంతో 174 పరుగులు చేసిన హైదరాబాద్.
అనంతరం ఛేదనకు దిగిన కోల్కతాని 161/9కే పరిమితం చేసింది. టోర్నీలో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కి చేరగా.. తాజా సీజన్లో ఇప్పటికే మూడు సార్లు చెన్నై చేతిలో ఓడిన హైదరాబాద్ మళ్లీ తుదిపోరులో ఆ జట్టుతో అమితుమీ తేల్చుకోనుంది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లు ముగిసే సమయానికి 138/7తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో వరుస సిక్సర్లతో రషీద్ ఖాన్ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్లు క్రిస్లిన్ (48: 31 బంతుల్లో 6×4, 2×6), సునీల్ నరైన్ (26: 13 బంతుల్లో 4×4, 1×6), శుభమన్ గిల్ (30: 20 బంతుల్లో 2×4, 1×6) నిలకడగా ఆడినా.. నితీవ్ రాణా (22) రాబిన్ ఉతప్ప (2), దినేశ్ కార్తీక్ (8), ఆండ్రీ రసెల్ (3) కీలక సమయంలో పేలవంగా వికెట్లు చేజార్చుకోవడం కోల్కతాని దెబ్బతీసింది. తాజా ఓటమితో కోల్కతా ఇంటిబాట పట్టనుండగా.. హైదరాబాద్, చెన్నై మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకి ముంబయిలోని వాంఖడే వేదికగా జరగనుంది.