జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చేయడాన్ని పాక్ సహించలేకపోతోంది. భారత్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని సంబంధాలను తెంచుకుంది. మరో వైపు అంతర్జాతీయంగా భారత్ పై ఒత్తిడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అవడంతో మరింత రగిలిపోతోంది.
ఒక వైపు ఉగ్రవాదులతో దాడులు చేసేలే ప్రేరేపించడంతోపాటు…యుద్ధ వాతావరణాన్నిసృష్టిస్తోంది. సరిహద్దులకు యుద్ద విమానాలను మోహరిస్తోంది. లడాఖ్ సరిహద్దులో ఉన్న స్కర్దూ ఎయిర్ బేస్ కు మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించింది.
యుద్ధ విమానాల ఆపరేషన్స్లో ఉపయోగించే సామగ్రిని పాక్ సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేగాక.. పాక్ తమ జేఎఫ్-17 యుద్ధ విమానాలను కూడా ఎయిర్బేస్కు తరలించే యోచనలో ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం.
స్కర్దు ఎయిర్బేస్ లద్ధాఖ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. సరిహద్దుల్లో పాక్ చేపట్టే సైనిక ఆపరేషన్స్కు ఎక్కువగా ఈ బేస్నే ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఆ వాయు స్థావరానికి సైనిక పరికరాలను తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది
దీంతో భారత్ అప్రమత్త మయ్యింది. పాక్ చేస్తున్న చర్యలును అన్నింటినీ గమనిస్తోంది. సరిహద్దుల వెంబడి నిఘాను ముమ్మరం చేసింది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కదలికలను భారత నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం.