దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ కాలు మోపిన తర్వాత జరిగిన మొదటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరువు నిలుపుకుంది. ఎన్నికల ఫలితాల ప్రారంభంలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఒకానొకసారి కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యం చూపించింది. చివరికి కాంగ్రెస్కు వెనక్కు నెట్టి బీజేపీ ముందుకు వచ్చింది. అది కూడా స్వల్ప తేడాలోనే. పది సీట్లు ఎక్కువ తక్కువ ఇరు పార్టీల మధ్య ఉన్నాయంతే. కాంగ్రెస్ 87, బీజేపీ 93 మాదిరి చాలాసేపు ఫలితం కొనసాగింది. తర్వాత కాంగ్రెస్ తగ్గి బీజేపీ పెరిగింది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే మొత్తానికి గుజరాత్లో బీజేపీనే అధికారం చేపట్టనుంది. కానీ గతంలో కంటే తక్కువ సీట్లతో. గతంలో 115 ఎమ్మెల్యేలతో అధికారంలో కొనసాగింది. ఆరోసారి బీజేపీ గుజరాత్లో అధికారం చేజిక్కుంచుకుంది. ఈ ఎన్నికల్లో జాట్లు, పటేళ్ల ప్రాబల్యం బీజేపీని కొంపముంచింది. జీఎస్టీ, నోట్ల రద్దు కూడా కారణంగా తెలుస్తోంది. గుజరాత్లో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. 92 స్థానాలు వస్తే ఆ పార్టీ విజయం సాధించినట్టే. బీజేపీ దానికన్నా రెండు, మూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ గెలుపు
మంచుకొండల్లో కమలం పువ్వు పూసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు పక్కకు పెట్టి కమలం కావాలనుకున్నారు. 68 స్థానాల్లో 35 సీట్లు ఎవరు గెలిస్తే వారిదే అధికారం. ఇక్కడ ఫలితాల్లో మొదటి నుంచి బీజేపీ ఆధిక్యం చూపిస్తూ వస్తోంది. బీజేపీ 35, కాంగ్రెస్ 25గా ఆధిక్యం కొనసాగుతోంది. ఇంకా ఫలితాలు పూర్తిగా వెల్లడి కాలేదు.
మొత్తానికి రెండు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టనుంది. కాంగ్రెస్ గుజరాత్లో బల ప్రదర్శన చేయగా హిమాచల్ ప్రదేశ్లో ఓటమిని చవిచూసింది.