- హిమాచల్ ప్రదేశ్ బీజేపీ సీఎం అభ్యర్థి ఓటమి
రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించినా బీజేపీకి హిమాచల్ప్రదేశ్ గెలుపుపై నిరుత్సాహం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని 44 సీట్లు సాధించి విజయగర్వంతో తీసుకుంది. అయితే బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమల్ ఓటమి చెందడం నిరాశకు గురి చేసే అంశం. ఆయన గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీనియర్ నేత అయిన అతడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఓటమి పాలవడంతో నిరాశే మిగిలింది. ఎప్పుడూ పోటీ చేసే హమీర్పూర్ నియోజకవర్గాన్ని వదిలేసి సుజన్పూర్ నియోజకవర్గంలో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఒకప్పటి తన అనుచరుడు రాజిందర్ రానా చేతిలోనే ధుమల్ ఓడిపోవడం మింగుడు పడని విషయం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం బీజేపీ హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తి ఓటమిపాలవడం.
ఈనేపథ్యంలో ధుమల్ కుమారుడు, హమిర్పూర్ లోక్సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ను ముఖ్యమంత్రి చేయాలని భావిస్తున్నారు. ఇక కేంద్రమంత్రి జేపీ నడ్డాను కూడా సీఎంగా పరిశీలిస్తున్నారు. అయితే అతడి ఓటమి బీజేపీనే కావాలని చేసిందని విమర్శలు వస్తున్నాయి.