గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి ఇప్పటికీ తేరుకోని ప్రతిపక్ష టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టోను ప్రకటించి మరింత చులకనై పోయింది. పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో తీసుకురావడంపై రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకున్నారు. ఆ విషయమై తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం టీడీపీకి గట్టిషాక్ ఇచ్చింది. టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. మేనిఫెస్టోకు సంబంధించి టీడీపీ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
మేనిఫెస్టోను వెంటనే వెనక్కు తీసుకోవాలని టీడీపీని ఆదేశించింది. జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. మేనిఫెస్టోతో పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా, పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడం పట్ల వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా… టీడీపీని ఎస్ఈసీ వివరణ కోరింది. అక్కడ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో మేనిఫెస్టోను రద్దు చేసినట్లు ఎస్ఈసీ ప్రకటించింది.
ఏమేం చర్యలకు పూనుకునేవారో..
అయితే, టీడీపీ మేనిఫెస్టో రద్దుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బిత్తిరి చర్యలను అంత సింపుల్గా వదిలేస్తారా అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే పని అధికార వైసీపీ చేస్తే.. నిమ్మగడ్డ ఇంత సుతిమెత్తగా.. మేనిఫెస్టోను వెనక్కి తీసుకోండి అని చెప్పేవారా? ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రజలను మభ్యపెట్టాలని వైసీపీ చూస్తోందంటూ నానాయాగీ చేసేవారా కాదా? అవసరమనుకుంటే ఆ పార్టీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు కూడా చేసేవారేమో? అని జన బాహుళ్యం చర్చించుకుటోంది. తన ఆత్మబంధువైన చంద్రబాబు కాబట్టే నిమ్మగడ్డ ఇంత సున్నితంగా, సుతారంగా ఓ మాట చెప్పేసి వదిలిపెట్టారని అంటున్నారు.
నిమ్మగడ్డ యాప్ కి షాక్.. అప్పుడే వద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!