బీజేపీ చేతిలో దుబ్బాక ఉప ఎన్నికలో పరాభవం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా 55 సీట్లకే పరిమితమైన అధికార టీఆర్ఎస్ రాజకీయంగా కొంత ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక గతమెంతో ఘనకీర్తి అన్నతీరుగా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పనితీరు పేవలంగానే ఉంటోంది. ఇక వ్యవసాయ చట్టాలపై రైతుల భారత్ బంద్ పిలుపునకు రెండు పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నేడు (డిసెంబర్ 8) బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపి కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను ఎక్కడిక్కడ ఎండగడుతోంది.
ఈ నేపథ్యంలోనే భవిష్యత్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేసే అవకాశం ఉందా? జాతీయ స్థాయిలో పోరాటం చేసి నరేంద్ర మోదీ సర్కార్తో ఢీ కొడతామని చెప్పిన కేసీఆర్ ఆ దిశగా ఆలోచిస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో బాగా బలహీనపడిపోయిన కాంగ్రెస్కు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమైపోయింది. నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్తేనే మంచిదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ శ్రేణుల్లో సైతం ఇదే రకమైన అభిప్రాయం ఉందని తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే మరింత బలపడాల్సి ఉందని, కాంగ్రెస్ కంటే ఇప్పుడు బీజేపీయే తమకు పెద్ద శత్రువని భావిస్తున్నారు. కాబట్టి ‘కమలం పార్టీ దూకుడుకు చెక్ పెట్టాలంటే చేతిలో చేయి వేసి నడిస్తే బాగుంటుంది’ అని అంటున్నారు.
ఇదిలాఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో విఫలం అయ్యాయని సీఎం కెసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి అవసరం ఉందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆ దిశగా ఫెడరల్ ప్రంట్ అలోచనను కూడా కేసీఆర్ బయట పెట్టారు. పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో మంతనాలు జరిపారు. తాజాగా డిసెంబర్ రెండో వారంలో వారందరితో సదస్సు నిర్వహిస్తామని కూడా టీఆర్ఎస్ అంతర్గత సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. చూడాలి రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో!
Also Read: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. అలాంటి నేతలే ప్రధాన టార్గెట్