తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీరు సొంత పార్టీలోనే అసహనం పెంచేదిగా ఉంది. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు బాధ్యతలను నెల్లూరు జిల్లా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు అప్పగించడమే దీనికి కారణం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన సోమిరెడ్డి పనబాకను ఏ రకంగా గెలిపించగలడా అని తెలుగు తమ్ముళ్లు బిత్తరపోయి చూస్తున్నారట. అదేవిధంగా గతేడాది ఎన్నికల్లో అనిత కూడా విఫలమయ్యారు. ఈమెకు తిరుపతి రాజకీయాల గురించి ఏం తెలుసునని ప్రచార బాధ్యతలు అప్పగించారనేది టీడీపీ నేతల్ని తొలుస్తున్న ప్రశ్న.
పైగా ఇక్కడ స్థానిక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రత్యేక వర్గంగా ఉన్నారు. ఆమె తన వర్గానికి పార్టీలో తగిన ప్రాధాన్యం నివ్వడం లేదని అలకబూనారు. తిరుపతి టీడీపీ కేడర్లో సుగుణమ్మకు అంతో ఇంతో ప్రాధాన్యం ఉంది. అయితే, స్థానికంగా ఉన్న ఈమెను పక్కన పెట్టి చంద్రబాబు ఎక్కడెక్కడివారికో ప్రచార పగ్గాలు ఇవ్వడం ఫలిస్తుందా? అని అటు టీడీపీ అభిమానులు, ఇటు పనబాక వర్గంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి గత ఎన్నికల్లో తన వ్యూహాలేవీ ఫలించక ప్రతిపక్షానికి పరిమితమైన చంద్రబాబు తాజా ఎన్నికలో ఏ మాత్రం విజయం సాధిస్తారో చూడాలి!!
భారీ తేడాతో ఓటమి, అయినా టికెట్
కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి గతేడాది ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్కు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు 2 లక్షల ఓట్ల పైచిలుకు తేడాతో ఆమె బల్లి దుర్గాప్రసాద్ చేతిలో అపజయం పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు కాస్త వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. అందుకనే అందరికన్నా ముందు తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిగా పనబాక పేరును ప్రకటించారు.
క్షేత్ర స్థాయిలో టీడీపీ బలహీన పడటంతో పనబాక బీజేపీ తీర్థం పుచ్చుకుందామనే ప్రయత్నాల్లో ఉండగా.. ఆమెను పార్టీ నుంచి వెళ్లకుండా ఆపేందుకు చంద్రబాబు ఆగమేఘాలమీద ఈ ప్రకటన చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు అందరికన్నా ముందుగానే ఆమెకు టికెట్ ప్రకటించి గ్రూపు రాజకీయాలకు, ఆశావహుల నిరసనలకు బాబు చెక్ పెట్టినట్టుగా చెప్తున్నారు. అయితే, కాషాయ పార్టీలో చేరదామనుకున్న పనబాక చంద్రబాబు వ్యూహంతో ఒకింత కలవరానికి గురైనట్టు సమాచారం. కాషాయ కండువా కప్పుకునే సమయానికి తనను సంప్రదించకుండానే ఉప ఎన్నిక అభ్యర్థిగా ఫైనల్ చేయడంతో చంద్రబాబు ముందు ఆమె కొన్ని డిమాండ్లు కూడా పెట్టినట్టు తెలిసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా?
కారు పార్టీతో కాంగ్రెస్ కలిసి నడుస్తుందా?