వెన్న లాంటి పాటలు రాసిన వెన్నెలకంటి మొన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన లేకపోయినా ఆయన రాసిన పాటలు నేటికీ నిత్యనూతనంగా శ్రోతల హృదయాలను ఆకట్టుకుంటాయి. వాటిలో ఒక ఐదు పాటల గురించి ఇక్కడ..
మాటరాని మౌనమిది(మహర్షి)
వెన్నెలకంటి అనగానే డబ్బింగ్ పాటల రచయిత అనిపిస్తుంది. అయితే తెలుగులో అనేక పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. అందులో ఆయనకు విశేషమైన పేరు తెచ్చిపెట్టిన పాట ఇది. ఇళయరాజా సంగీతం, బాలు, జానకమ్మల గానం ఈ పాటను చిరంజీవివి చేసింది.
శ్రీరంగ రంగనాథుని (మహానది)
తమిళంలో కమల్హాసన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం చిత్రం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది. అందులో ప్రాచుర్యం పొందిన పాట ఇది. ఈ పాట విన్నాక దర్శకుడు కె.విశ్వనాథ్ వెన్నెలకంటి గారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారట.
సన్నజాజి పడక (క్షత్రియ పుత్రుడు)
ఈ పాట వినని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు ప్రతి స్టేజీ మీద వినిపించే పాట ఇది. తమిళంలో ఈ పాటకు గాను ఎస్.జానకి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకున్నారు. తెలుగులో చాలా అద్భుతంగా అనువదించారు వెన్నెలకంటి.
నేనాటోవాణ్ని.. ఆటోవాణ్ని(బాషా)
తమిళంలో సంచలనం సృష్టించిన ‘బాషా’ను తెలుగులో అనువదించారు. దానికి వెన్నెలకంటి రాసిన ఈ పాట నేటికీ పాపులర్. పరభాషా గీతాన్ని తెలుగు పాటలా మలచడంలో ఆయనది అందెవేసిన చేయి.
రాసలీల వేళ (ఆదిత్య 369)
బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘ఆదిత్య 369’ సినిమాలో ఈ పాట నేటికీ వన్నె తగ్గలేదు. ఇళయరాజా గీతాల్లో అత్యుత్తమ మెలొడీల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. వెన్నెలకంటి పదాలతో కలం తేనె కురిపించింది.